Wednesday, August 31, 2005

ఆంధ్రమహాభారతం - కవిత్రయం ప్రాజెక్టు

తెలుగు ఒక సుందరమైన భాషగా ఆంధ్రమహాభారతం ద్వారా పుట్టింది। ఏ విధంగా చూసినా అది మన సంపద, వారసత్వం అని అనిపిస్తుండేది। ఒకటి రెండు అందులోని పద్యాలు పాఠ్య పుస్తకాలలో చదవడం మినహా, ఆ గ్రంథంతో పరిచయం లేదు। ఈ మధ్య వింటున్న ప్రవచనాల వలన, చదువుతున్న పుస్తకాల వలన మక్కువ ఎక్కువయ్యింది। ఇలాంటి సమయంలో, internet లో మొదలయిన ఒక సంకల్పం ద్వారా ఆంధ్రమహాభారతాన్ని మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం కలిగింది। అదే "ఆంధ్రమహాభారతం - కవిత్రయం ప్రాజెక్టు"। UNICODE లో ఆంధ్రమహాభారతాన్ని రాయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం।

నాకు తెలిసిన ఛందస్సు, భాష పరిజ్ఞానంతో ఒక తేటగీతి పద్యం రాయడానికి చేసిన ప్రయత్నం।

తే.గీ.
ముగ్గురు కవులు మలచిన మేటి కవిత
పుణ్య తెలుగు భారతికిది పుట్టినిల్లు
ఆంధ్రభారతం అందరం అందవలెను
కూర్చ వలెను మనము యూనికోడు నందు

ఛందస్సు గురించి internet లో నాకు బాగా ఉపయోగపడే వ్యాసం

Tuesday, August 23, 2005

చిత్రానికి వ్యాఖ్య

"ది హిందు" (The Hindu) వార్త పత్రికలోని చాయాచిత్రాలను net లో ఇక్కడ చూడవచ్చు। నూటపాతిక సంవత్సరాల సుధీర్ఘ కాలానికి, చరిత్రకి సంబంధించిన ఛాయాచిత్రాలున్నయి। అలానే, సృజనాత్మకమయినవి కూడా ఉన్నాయి।

ఈ చిత్రం నన్ను ఆకర్షించింది!!!!

మన పాత కవులు, ఇలాంటివి ఊహించి, ఆ ఊహాచిత్రాలకి సొంపైన పదాలు కూర్చి కవితలల్లారేమో అని అనిపిస్తుంది। ఆ చిత్రానికి వ్యాఖ్య రాద్దామని చేసిన ప్రయత్నం.........

అందమైన ఆ పాదాల పారాణి కాదు గదా
కనువిందు చేస్తున్న ఈ చిన్ని చేపపిల్లలు !!!!

Friday, July 22, 2005

హైదరాబాదు ట్రాఫిక్కు చిక్కులు

కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్
ఇది మన హైదరబాదేనోయ్
గడి గడికో అడ్డుతగులునోయ్
అయినా, వడి వడిగా దూరిపోతారోయ్

నాలుగొందల సంవత్సరాల
ఘన చరిత్ర ఉన్న భాగ్యనగరం
కానీ, రెండే గంటల వాన
తుడిచిపెట్టింది దీని సౌభాగ్యం
వాన వెలిసింది, అసలు తెలిసింది
మారింది ఇది దౌర్భాగ్యనగరం
నడిరోడ్డున ట్రాఫిక్కు నిలిచిపోయి
అయ్యారు అందరూ నిర్భాగ్యులు
నేనూ ఉన్నాను ఆ "జాము"లో
ఆహా!! ఏమి నా భాగ్యం

ఇంతలో, ఇదంతా టీవీ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం
ఆతృతతో ఇంటినుంచి ఫోనులో వాకబు చేయడం
మాట్లాడి, అందించాను నా క్షేమ సమాచారం
కానీ అనుకున్న దానికన్నా ముదిరింది వ్యవహారం

నీరు పారి దారులు అయ్యాయి ఏరులు
ఆగిపోయి బారులు తీరాయి బస్సులు, కారులు
నిజమయ్యాయి ట్రాఫిక్కు జాముపై విన్న పుకారులు
అయినా, చక్కబెట్టడానికి ఒక్కరూ లేరు అధికారులు।

ఇంత అసౌకర్యం జన్మానికో శివరాత్రి అంటే తప్పు!! తప్పు!!!
నగరంలో ఏ రోజు లెదు ట్రాఫిక్కు ఇబ్బంది చెప్పు!! చెప్పు!!!

చిక్కడపల్లి ట్రాఫిక్కులో చిక్కి
ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకున్నాను
కానీ, ఎరుక ఉన్నా ఇరుకు సందులైతే
ఇరుక్కోక తప్పదని తెలుసుకున్నాను

ఇక నాలుగు రోడ్ల కూడాళ్ల జాములో
విజృంభిస్తుంది నాలుగు పడగల ట్రాఫిక్కు నాగరాజు
సహస్ర నాసికా గొట్టాల నుండి విషవాయువులు పంపించి
వాతావరణ కాలుష్యం పెంచి
మన ఆయుష్షు తగ్గించి
మనకు శోష తెప్పించినంత పని చేస్తుంది

కాదే రోడ్డూ ఆర్టీసీకి అనర్హం
ముఖ్య రహదారయినా, కాలనీ రాడ్డయినా
అన్నిటా బస్సులు ప్రత్యక్షం,
నగరం రోడ్లపై వాటి స్వైర విహారం।
పాపం, ఎంతో మందికి
గమ్యం చేరుటకు అవే ముఖ్య ఆధారం
అయితే, అప్పుడప్పుడు
part time లో యమదూతలకు సహకారం

ఆటోవాలా,
ఈ నైజాము రాచనగరు రోడ్లకి నజరానాలేని నవాబు
అడ్డదిడ్దంగా నడుపుటయే అతనికి పెద్ద కితాబు
ఎంత విర్రవీగి ఎలా నడిపినా చెల్లును అతని రుబాబు
ఆటోల వెంబడి బండి నడిపితే, మనఃశాంతి పూర్తిగా ఖరాబు

ఈ గందరగోళంలో మన పాత్ర కూడా ఎంతోకొంత
అందుకే, గుర్తుంచుకొని ట్రాఫిక్ నియమాలు పాటించాలి మనమంతా
ముందుగా నేను అలవరుచుకుని, నిబంధనలు పాటిస్తాను చేతనయినంత

Sunday, July 10, 2005

కొన్ని తకపిక(random) ఆలోచనలు

Internet లో
Big houses, small homes
Fat Salaries, less time to spend
Lots of leisure, but no happiness etc etc...
అని ఒక forward చూసాను। దానికి ఇంచుమించు తెలుగు అనువాదంలాంటిది. ఒకటి అర నా ఆలోచనలు కూడా ఉన్నాయి..... చాలా చోట్ల విన్న, చదివిన భావాలే.... తెలుగులో నాకు తోచిన పదాలలో, నా సంతృప్తి కోసం రాసుకుంది.

----------------------------------------------------------------
తీరాల మధ్య తరిగిన దూరాలు
తరాల మధ్య పెరిగిన అంతరాలు

విశాల దృక్పథాలు సువిశాల భావాలు
కాని కుత్సిత స్వభాలు ఈర్ష్యా ద్వేషాలు

పెద్ద జీతాలు ఇంకా పెద్ద ఇళ్లు
చిన్న కుటుంబాలు చిన్న సంసారాలు

ఎన్నో పరిచయాలు ఎన్నెన్నో పలకరింపులు
కొన్నే బంధాలు చాలా కొన్ని అనుబంధాలు

చాలా ఆలోచనలు
చాలని ఆచరణలు

ఆధునికత వైపే మొగ్గు
మన భాష, వారసత్వాలంటే ఎందుకో సిగ్గు

లెక్కలేనన్ని కులాసాలు విలాసాలు
తక్కువ అవుతున్న చిన్ని చిన్ని సరదాలు

Sunday, May 01, 2005

ఒక కవిత

ఈ చిత్రాన్ని చూసినప్పుడు కలిగిన భావాలు॥॥।



ఉదయిస్తున్న సూర్యుడికై ఉత్సాహమా
అస్తమిస్తున్న అర్కునికై ఆవేదనమా!!

సౌందర్యరాశి నుదుటి సౌభాగ్య సింధూరమా
కర్కశుని కరవాల కౄర కార్యమా!!

ప్రశాంతత నిండిన సువిశాల సౌమ్య సంద్రమా
దాగిన సుడిగుండాలతో భీతి గొల్పు జలాశయమా!!

మనసుని మురిపించు మలయ-మారుతమా
జగముని జడిపించు ఝంఝా-మారుతమా!!

మంచి చెడుల భావనలతో ఊగిసలాటయే జీవనమా
మంచి చెడుల కతీతమైన దానికై ఆరాటపడవే ఓ మనమా!!

Monday, April 18, 2005

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఒకటి)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య


"తనకీ, ప్రపంచానికీ, సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వం"
- చలం (శ్రీశ్రీ - మహాప్రస్థానం - 'యోగ్యతా పత్రం' లో)


వినుకొండ పొలిమేరలను దాటి, వినువీధి అంచులను తాకటానికి ఉద్యమించిన విశ్వనరుడుగా, వీను మిగిలిన కవివరుడుగా తెలుగు సాహితీ ప్రపంచంలో పేరు ప్రతిష్టలను పొందిన కవి జాషువా (1895-1971)। సామాజిక చైతన్యంతో విశ్వజనీనతను జోడించి, కారుణ్యం, మానవీయ విలువలను ఆవేదనను ఆవిష్కరించిన జాషువా పద్యకృతి 'గబ్బిలం'।


జీవిత కృతి - 'గబ్బిలం'

కవి శక్రేశుడు గండపెండెరములన్ గాంగేయ తీర్థంబులన్

వివిధోపాయన సత్కృతుల్ గొనిన గాంధీ శాంతి సిద్ధాంత మా

ర్థవ మార్గటుడు గబ్బిలంబులకు దౌత్యంబుల్ ప్రబోధించు మా

నవతా స్రష్టన్ నవ్యభావ చతురుండన్ జాషువాభిఖ్యుడన్


జాషువా తన గురించి చెప్పుకున్న పద్యమిది। కవులు, రచయితలు తాము ఎన్ని రచనలు చేసినా, వాటిలో తమకు నచ్చిందీ, ప్రజలు మెచ్చిందీ, ఆ కవికి లేక రచయితకు కీర్తి ప్రతిష్టలు గడించి పెట్టిందీ అయిన రచన సాధారణంగా ఒకటో, రెండో ఉంటాయి। అలాంటి రచనల్నే 'జీవితం కృతులు' (Life Works) అని అంటాం। ఆ కవి భావనా సర్వస్వం, కవితా శిల్ప సౌందర్యం సమస్తం, గుత్తుకు కొన్న కావ్యం అదే అయి వుంటుంది। జాషువా ఇంచుమించు ముప్ఫై పై చిలుకు గ్రంథాలు రచించాడు। "సర్వ పండితామోదముగా రచియించితిని (వి) ముప్పది కావ్యములు"। (నా కథ-158)। అయినా ఆయన ఆమరణాంతం చెప్పుకున్న కావ్యం "గబ్బిలమే"। ప్రజలు మెచ్చి ప్రశంసించిందీ "గబ్బిలాన్నే"। అందువల్లే, 'గబ్బిలం' జాషువ జీవిత కృతి। అంతేకాదు, ఆయన రచనలల్లోనే అది 'శిరశ్శేఖర కృతి' (Monumental work) కూడా! జాషువా మిగిలన రచనలన్నీ ఒక ఎత్తు 'గబ్బిలం' ఒక్కటీ ఒక ఎత్తు। జాషువా జీవత ప్రస్థానానికీ, సామాజిక దర్శనానికీ నిదర్శనంగా నిలిచేది ఈ 'గబ్బిలం' కావ్యం।


గబ్బిలం: ఖండకావ్యం

గురజాడ తో 'కావ్య ఖండిక' ల రచన (1910) ఆరంభమైనా, ఖండకావ్య ప్రక్రియ మాత్రం రాయప్రోలు సుబ్బారావుగారి చేతిలోనే మొలకెత్తింది। అది జాషువా చేతిలో పుష్పించి ఫలించింది। ఖండకావ్య రచనలో అఖండ ప్రతిభా సంపన్నుడు జాషువా। ఆయన ఖండకావ్యాలు అటు రాశిలోను, ఇటు వాసిలోను మిన్న అయినవే। "ఫిరదౌసి", "గబ్బిలం", "కాందిశీకుడు", "ముంతాజమహలు", "నేతాజీ", "ముసాఫరులు" మొదలైన ఖండకావ్య రచనలతో పాఠకలోక ప్రాచుర్యాన్ని చూరగొన్న కవి జాషువా। వీటిల్లో "గబ్బిలం" రెండు భాగాలున్న ఖండకావ్యం। మొదటి భాగంలో సుమారు 117 పద్యాలు। రెండవ భాగంలో 142। మొత్తం 259 పద్యాలున్న గబ్బిలాన్ని లఘుప్రబంధం అనవచ్చు। మొదటి భాగం 1941 లోను, రెండవ భాగం 1946 లోను రచించబడ్డాయి।


"గబ్బిలం"- స్వీయచరిత్ర నివేదనాత్మకం

"Best poetry is always autobiographical"(ఉత్తమ కవిత ఎప్పుడూ స్వీయ చరిత్ర నివేదనాత్మకమే) అని అంటాడొక అంగ్ల విమర్శకుడు। దానికి అక్షర సాక్ష్యం గబ్బిలం।

కుల మత విద్వేషంబుల్

తలసూపని తావులే కళారాజ్యంబుల్

కళ లాయుష్మంతములై

యలరారెడు నెలవు స్వర్గమగు చెలికాడా!


(నా కథ 1-127)

కళాకారులందరిదీ ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం। ఆ విశాల దృక్పథం లోపిస్తే కళలు బతకవు। ఒక వేళ బతికినా బట్టకట్టవు। జాషువా చిన్నతనం నుంచి అటు వ్యక్తిగా, ఇటు కలావేత్తగా కుల వివక్షతకు నలిగిపోయాడు। 'నా కథ'లోన 'వ్యధా ఘట్టములు' ఆ గుండెకోతకు, ఆ ఆవేదనకు అక్షర రూపాలు। "లోకం నా వంక కోరగా, వారగా చూచింది। అనాదరించింది। అసత్కరించింది। సత్కరించింది। దూరపర్చించి। చేరదీసింది।"(నా కథ - ఒక మాట)। జాషువా జీవిత ప్రస్థానాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి। అయన కవితా సృష్టికి ఇదే ప్రత్యక్ష్య నేపథ్యం।

ఒక రోజు బాల జాషువా వినుకొండ వీధిలో వెళుతుండగా అగ్రవర్ణానికి చెందిన మరో బాలుడూ ఆ వీధినే పోతూ "నాను తాకకు। దూరంగా పో!" అని ఈసడించుకున్నాడట। ఆ అవమానాన్ని భరించలేక తన ఆవేదనను తల్లిముందు తోడుకున్నాడు। తల్లి బాలుని కన్నీరు తుడిచింది। తన కళ్ళలో నీళ్ళుబుకుతున్నా తమాయించుకుంది। ఆ పిల్లవాడే మరికించెం ఎదిగి కవిత లల్లటం మొదలు పెట్టాడు। బాలకవిగా తాను 'వ్రాసిన వ్రాతలు గని సెహబాసను వాడొకడు లేక వ్యధ'కు గురి కావలసి వచ్చింది। దానికి తోడు, 'వాదన చేసి కాదనెడి పాటి సమర్థత'లేని చిన్ననాడు తన ఊళ్ళోని వైష్ణవ పూజారి 'ఇతర జాతులు కైతలల్ల రాద'ని 'పురాణ యుగధర్మ సూత్రాల'ను వల్లించి, జాషువా లేత మనసును గాయపరిచాడు। దీనిని మించి జాషువా హృదాయాన్ని కలచివేసిన సంఘటన మరొకటి ఆయన కవితా వ్యాసంగ ప్రారంభదినాలలోనే జరిగింది। తన ఆశుకవితా నైపుణ్యంతో కొప్పరపు సుబ్బారావుగారు వినుకొండలో జరిగిన ఒక సభలో ప్రజలను ఉర్రూత లూగించారు। జాషువా ఆయన్ని అభినందిస్తూ పద్యాలు అప్పటికప్పుడు ఏవో గిలికాడు। వాటిని ఆయనకు అందజేయటానికి భపడుతూ, స్భాస్థలి దగ్గర తారట్లాడే జాషువాని ఆయన భ్రాహ్మణమిత్రుడొకడు వేదిక దగ్గరకు తీసుకువెళ్ళాడు। సుబ్బారావుగారు పద్యాలు తేసుకొని చదివి, సహృదయంతో బాలకవిని అభినందించారు। సభలో 'గుభగుభలు' బయలుదేరాయి। 'అభాగ్యుడీ నిమ్నజుడు సభలోని కెట్టు జొరబడెన'ని పదిమందీ ఉద్దతులై లేచిపోయారు। అలనాడు భారత కాలంలో అస్త్రవిద్యా ప్రదర్శ్నలో కర్ణుడికి జరిగిన అవమానమే తిరిగి ఆనా జాషువాకి జరిగింది। ఆ రోజంత ఇక ఇల్లుదాటి బైటికి రాకుండా, భోజనం చేయకుండా, తనలో తానే ఏద్చుకుంటూ దుఃఖంలో తలమున్కలై పొద్దుపుచ్చాడట। ఇలాంటి సన్నివేశాలా నెన్నింటినో ఆయన కవిగా నిలదొక్కుకునే రోజులలో ఎదుర్కొన్నాడు। "కుల భేదశానికి నువ్ మెదలెడు దేశమిద్ది నిను మిచ్చదు, మెచ్చిన మెచ్చకున్న శారద నిను మెచ్చె మానకుము ప్రాప్త కవిత్వ పరిశ్రమంబులున్" (నా కథ)- అని జాషువా భుజం తట్టి కందుకూరి వీరేశలింగంగారు అన్న మాటలు జాషువాకు అదర్శాలయ్యాయి।

చక్కని కవితకు కులమే

యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం

కెక్కడి ధర్మము తల్లీ?

దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ

(ఖం।కా।భాగం-2, సందే)

అలాగే 1933-34 సం ల ప్రాంతంలో ఒకనాడు జాషువా వెంకటగిరి రాజైన యాచేంద్రభూపతిని సందర్శించటానికి రైల్లో వెళ్తున్నాడు। రైల్లో పరిచయమైన వ్యక్తి జాషువా కవి అని తెలుసుకొని అయన కవితలు విని ఎంతో సంతోషించాడు। జాషువాను ఎంతగానో అభినందించాడు। ఇంతలో ప్రసంగం కులంమీదకు మళ్లింది। జాషువాని ఆయన 'మీదే కుల'మని ప్రశ్నించాడు। జాషువా చెప్పాడు। అంతే అప్పటి వరకు జాషువాని పొడిగిన వ్యక్తే చివాలున లేచి వెళ్లిపోయాడు। గుండెను పిండే ఈ సంఘతననే జాషువా రాజుగారికి ఇలా చెప్పుకొని వాపోయాడు।


నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే

ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ

దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో

బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్


(ఖం।కా।భాగం-2)


ఇలాంటి సన్నివేశాలకు జాషువా జీవితంలో కొదవలేదు। అంతేకాదు, అన్నింటి కంటే విచిత్రమైంది - అటు క్రస్తవ సోదరులచేత విలివేయబడ్డడు। ఇటూ సవర్ణ హిందువుల చేత ఈసడింపబడ్డాడు। ఇంటి నుండి తరిమివేయబడ్డాడు। ఇదంతా కేవలం 'కులం కుట్రే'! కవిగా ఆయన లబ్దప్రతిష్టుడైన తర్వాత కూడా సభల్లో, సన్మానాల్లో ఈయన గురించి ప్రసంగించే వక్తలు 'పంచమ జాతిలో పుట్టి ఇంత గొప్పకవిగా రాణించినవాడు' అని అంటుంటే జాషువా గుండెలు అవిసిపోయేవి। 'నన్ను జాషువాగా ఇందుకు గుర్తించరు?' అని ఆయన అంటుండేవారట। ఇలా ఆయన జీవితంలో కుల ప్రాతిపదిక మీద ఎన్ని దూషణాల్ని, తిరస్కారాల్ని ఎదుర్కొన్నా, వాటిని లెక్కచేయలేదు। ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు।

గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న

న్నెవ్వెధి దూఱినన్ ననువరించిన శారద లేచిపోవునే

యవ్వసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంట మూనెదన్

రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్

(నా కథ)

ఇలాంటి విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో జాషువా తనను ఈసడించిన సమాజానికి ఎదురొడ్డి కవితలు రచించాడు। "విశ్వమానవ సౌభాతృత్వం, నిర్మత, నిర్జాతి సంఘం నా ఆదర్శం। ఒక జాతికి మతానికి చిందిన కవిత్వాలు మంచివి కావు। అవి కవిత్వాలు కావు। అలాటివి వీలునామా కవిత్వాలంటాను। నా భావం సామాన్యులకు అందివ్వడానికి ప్రయత్నించాను। గహన సంచారంలేని కవిత్వం నా లక్ష్యం" అది జాషువా వెల్లడించాదు। ఈ ఆదర్శంతోనే ఆయన తన కావ్యాలన్నీ రాశాడు। ముఖ్యంగా 'గబ్బిలం' కావ్యం। అవి ఆయన నిరాశ్రయుడిగా గుంటూరులో కాలం గడుపుతున్న రోజులు। ఒక పాడుబడిన ఇల్లు దొరికింది। అదీ స్మశానానికి పక్కనే। గబ్బిలాలకు ఆటపట్టయింది ఆ ఇల్లు। రాత్రిళ్ళు చిన్న ఆముదపు దీపం। ఆ అంధకారంలో ఆయనకి గబ్బిలాలే నేస్తాలు।

ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె

విహరణము సేయసాగె గబ్బిలమొకండు

దాని పక్షాని లంబున వాని చిన్ని

యాముదపు దేపమల్లన నారిపోయె


ఓ వైపు ఆత్మవ్యధ, మరోవైపు కటిక చీకటి। ఇంకో ప్రక్క గబ్బిలాల సంచారం। ఆ విపత్కర పరిస్థితిలో, ఆ ఆవేదనలో రూపుదిద్దుకొన్న ఆలోచనాధార ఫలితమే 'గబ్బిలం' కావ్యం। జాషువా జీవితానుభవ దృశ్యాలే 'గబ్బిలం' రచనకు ప్రత్యక్ష హేతువులు। అందువల్లే 'గబ్బిలం' లోని ప్రతి పద్యంలోనూ ఆత్మీయతా స్పర్శ తొణికిసలాడుతుంటుంది। జాషువా తన వైయక్తిక బాధని, తన జాతి జనుల సమిష్టి బాధని ప్రత్యేకించి పలికినా, అది సాధారణీకరణాన్ని పొందింది। సర్వపాథక సమాదరణాన్ని ప్రోది చేసుకుంది। తనకీ సమాజానికీ సామరస్యం కుదరలేదు। అంతర్భాహ్య సంఘర్షణల నుంచి కావ్యం ఆవిర్భవించింది। 'కవిత్వానికి బధ పర్యాయ పద'మంటారు। ఆ బాధ నుంచి విముక్తి చెందటానికే జాషువా గబ్బిలాన్ని కూర్చాడు।

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (రెండు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

కాలం కంటే రెండడుగులు ముందే!

ఆంధ్ర సాహిత్య వికాసాన్ని ఒకసారి పునఃపరిశీలిస్తే - ఆడది లేకపోతే కృతికి అందం లేదనే భావంతో ధనతృష్ణ వెంటాడగా బృహన్నల వర్గం సంతోషం కోసం ప్రబంధ కవులు అనుత్తమ ప్రణయబంbధుర కావ్యాలు రచించటం కన్పిస్తుంది। కవిత చచ్చుదైనా కథ ప్రసిద్ధమైనదైతే కవికి కొంతకీర్తి గలుగవచ్చు। అలాంటి కవిత్వం నెలలు తక్కువైనా బలమైన తిండితో బ్రతికే పాపలాంటిది। "ప్రభువుల పెండ్లి పేరంటాలకు కొంతకాలం ఖర్చయింది। ఆ తరువాత రాణివాసాల్లోని విరహ వేదనల్ని రచ్చకీడ్చింది। అనంతరం అంగాంగ వర్ణనలతో యువతకు ఉచ్చులు వేసింది। 'పాడిన రామకథే మరలపాడి' ఆర్తులను అనాదరిస్తూ-భువన హితాన్ని కోరవలసిన కళాశక్తి స్వార్థ జడదిన ఊరవేయబడింది' అంటాడు జాషువా। ఇదీ మన సంచిత ధన సంపద। ఇక ఆధునిక యుగం।

జాషువా భావకవితా యుగంలో కలం బట్టిన కవ। "దిగిరాను దిగిరాను భువినుండి దివికి" "నా ఇచ్ఛయేగాక నాకేటి విరవు" అని కంత నగరాల (ivory towers) ల్లో విహరిస్తూ ఊహాప్రేయసి మీద గేయాలల్లూతూ, ఆ విరహంలో తలమున్కలై "మనసారగా ఏడ్వనీరు నన్ను" అంటూ భావుకవులంతా ఎవరికి వారు యధాశక్తి రోదిస్తున్న కాలమది। అయితే జాషువా భువిని వీడలేదు। దివిలో కాపురం పెట్టనూ లేదు।

పూదోటల మద భంభర

నాదముల విలాసవతుల నడబెడగుల నా

హ్లాదించు కవులకీ నిరు

పేదల ఆక్రందనములు వీనుల బడునా! (ముసాఫరులు)


అని సమకాలీన భావ కవులను నిరసించాడు। అందుకే భావ కవుల కంటే అభ్యుదయ కవులే ఈయనకు ప్రీతి పాత్రులయ్యారు। వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలనం, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు, సమ సమాజ నిర్మాణ, సమర విముఖత, శాంతిప్రియత వంటి అభ్యుదయ కవితా లక్షణాలు జాషువా కవితల్లో చోటుచేసుకున్నాయి।

మా కవు లాలపింతురు సమంచిత నవ్యయుగో చితంబులై

యాకటి చిచ్చు లార్చు హృదయ ప్రీతి దారి దయాకధాంశముల్

(కాందిశీకుడు)

ఈ అభ్యుదయ దృక్పథమే జాశువాచేత "గబ్బిలం" రాయించింది। దళిత వేదనకు అక్షరాకృతి నిప్పించించి। అసలు "గబ్బిలం" ఇతివృత్తమే అభ్యుదయాంశతో ముడిపడినటువంటిది। భరతమాతకు కడగొట్టు బిడ్డడైన ఒక అరుంధతీ సుతుడు-సమాజంలో పాతుకుపోయిన అంటరాని తనాన్ని, వర్ణ వ్యవస్థలోని క్రూరత్వాన్ని-తన సందేశంగా శివునికి గబ్బిలం ద్వారా విన్నవించుకోవటం ఈ కావ్యేతివృత్తం। రెండు భాగాలుగా సాగిన ఈ కావ్యం తొలి భాగంలో అరుంధతీ సుతుడు తన దైన్యాన్ని విన్నవించుకుంటాడు। సామాజికంగా అనుభవిస్తున్న నిరసనను వ్యక్తం చేస్తాడు। ఆపై గబ్బిలానికి మార్గనిర్దేషం చేస్తాడు। గబ్బిలం విశ్వానాధుని దగ్గరకు పయనమై వెళుతుంది। ఇది ప్రథమ భాగం। తర్వాత కొన్నాళ్ళకు గబ్బిలం మరలా కనిపిస్తుంది। వెళ్లిన పని "పండే"నని చెప్తుంది। మరలా పంచముడు తన గోడు వినిపించుకొంటాడు। భారత జాతి అనైక్యత, కుల, మతభేదాలు, స్వీయకులంలోని వైరుధ్యాలు, మూఢాచారాలు, దేశాభిమానం రెండవ భాగంలోని అంశాలు। వస్తుభావాల విషయంలో సమకాలీన కవుల కంటే ఒకడుగు ముందుకువేసి, దళీత కవిత్వానికి తెలుగులో బీజం వేశాడూ। ఈనాటీ 'దళిత కవితావాదకవు'లనీకులు కంటే జాషువా నిర్భయంగా, బలంగా, సూటిగా కవితను చెప్పాడు। కాబట్టే తెలుగు దళిత కవిత్వానికి "ఆది కవి" జాషువా। ఆయన "గబ్బిలం" కళిత కవితా మేనిఫెస్టో।


'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (మూడు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

గబ్బిలం - ప్రతీక కావ్యం:

'గబ్బిలం ' ప్రతీక కావ్యం। (Symbolic poem) "కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నేనీ కావ్యమును రచించితిని। గ్రంథ నామము గబ్బిలము। శ్రోతలకిది కటువుగా దోపవచ్చును। కాని యందలి కథా నాయకుడు ప్రణయ సందేశము నంపును। ఇత డంపునది తుక తుక నుడుకు నశ్రు సందేశము। అతని శిక్షా కాలపరిమితి యొక సంవత్సరము। ఇతని శిక్ష ఆజన్మాంతము। తర తరములు దీని కవధి లేదు। అతడు మన్మధాగ్ని తప్తుడు। ఇతడు క్షుధాగ్ని పీడితుడు। ఇరువురిలో నితడు దయనీయుడు"।

"గబ్బిలం" పీఠిక(విజ్ఞప్తి) లో జాషువా రాసిన మాటలివి। కవ మాటల్ని బట్టి, ఇతివృత్త నిర్వహణాన్ని బట్టి ఇది కాళిదాసు మేఘసందేశానికి అనుసరణ కావ్యమని స్పష్టమవుతుంది। అంటే సందేశ కావ్యం అన్నమాట। అక్కడ మేఘడు సందేశహరుడు। ఇక్కడ గబ్బిలం సందేశ హరిణి। ఇది సందేశ కావ్యమే అయినా, దీనిలో ప్రతీకవాద కవితా తత్త్వచ్చాయలు పుష్కలంగా వున్నాయి। 'గబ్బిలం' అరుంధతీ సుతునికి ప్రతీక। "పామునకు పాలు, చీమకు పంచదార"పోసి పోషించే హైందవ సమాజంలో గబ్బిలం మాత్రం ఒక "అపశకున పక్షి"గా పరిగణింపబడుతోంది। "మృగ పక్షిత్వ విచిత్ర ధర్మముక మూర్తిన్ని దాల్చియున్నట్టి నీ మోముంజూడదు లోకము" అని జాషువానే "ప్రాత పట్టింపు"లను ప్రస్తావించాడు। గబ్బిలాన్ని "వెలివేయబడిన" ప్రాణిగ ఇతర జాతులు కూడా గుర్తిస్తున్నాయి। ఈ లోక రీతిని పాటించే గబ్బిలాన్ని అరుంధతీ సుతుడికి ప్రతీకగా గ్రహించాడు జాషువా। అది విలుగు చూడాలేదు। పంచముల జీవితాల్లో వెలుగు లేదు। వారి చీకటి బతుకుల కది ఒక సంకేతం। వారి దైన్యానికీ, దయనీయతకీ గబ్బిలం తిరుగులేని ప్రతీక। సామాజిక దురన్యాయానికి బలై, సవర్ణ హిందువుల చేత వెలివేయబడిన పంచముని ఆక్రందన గబ్బిలం కావ్యానికి ఆయువు పట్టు।


తిరిపపు దమ్మిడీ తనివి దీపముగా వెలిగించి, దీపమే

యెరుగని నా కుటీరమున నృత్యమొనర్చు మహాపిశాచి, చిం

పిరితల చిక్కులమ్మ, తరి బీయతు జేసెడి నన్ను, భూమికిన్

బరువుగ గబ్బిలాయిగ! తృణంబుగ! జుల్కనగ! హుళక్కిగా



సమకాలీన సామాజిక దర్పణం:

ఒక కవి కవితాస్థాయిని చైతన్యాన్ని అతడు ఎంచుకొన్న వస్తువు, భావజాలం, అభివ్యక్తి నిర్దేశిస్తాయి। ఒక బలమైన సామాజిక భూమిక లేకపోతే, ఎంత గొప్ప కవిత్వం రాసినా అది నేల విడిచిన సామే అవుతుంది।

రచయిత మౌలికంగా సంఘజీవి। కాబట్టి అతని ఆలోచన ఎంత స్వతంత్రించినా, అది సంఘికమైనదే అవుతుంది। సమాజంలోని ఏ చలనానికైనా అప్రమత్తుడైన ఏ రచయిత (conscious writer) అయినా స్పందిస్తాడని చెప్పడం పరిపాటి। అలా నూటికి నూరుపాళ్ళు స్పందించి, కవిత లల్లినవాడు జాషువా। ఆయన గబ్బిలం సమాజంలో పుట్టింది। సమాజాన్ని ఎత్తి చూపింది। సామాజిక అసమానతలని చీల్చి చెండాడింది। మానవతకు అర్థం చాటి చెప్పింది।

జాషువా పుట్టే నాటికి(1895) భారతదేశం బానిసత్వంలో మగ్గుతోంది। బ్రిటిష్ సామ్రాజ్యవాదం బలం పుంజుకొంటోంది। ఆనాడు దేశం పరాయి పరిపాలనలో మగ్గడం అలా ఉండగా, సమాజం భయంకరమైన రుగ్మతులతో లుక లుక లాడిపోతూ వుంది।

స్వపరిపాల మన్న శబ్దంబు దేశంబు

వీనుల విందుగా వినకముందు

ఘన దురాచార సాగర మగ్నమై ప్రజా

బాహుళ్య మొడ్డున పడకముందు

కొలత గింజల శాసనంబులకు విరచి

కొట్లలో పంట తలదాచుకొనకముందు

ప్రభవ మందితి॥॥॥


అని జాషువా స్వీయచరత్ర "నా కథ"లో చెప్పుకున్నాడు। బాల్యం నుంచే బ్రిటిశ్ పెత్తందారి తనాన్ని నిరసించాడు।

సహింపదయ్యె శైశవమందె నా చిన్ని

చిత్తంబు తెలవారి పెత్తనంబు


అన్నాడు। తండ్రి "బాప్టిజాన్ని" (Baptism) పొంది తెల్లవారి దగ్గర పనిచేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు।

తానము నంది క్రైస్తవ మతంబున జేరి కులంబు గోత్రమున్

మానిన వెర్రిగొల్లడ వమాయక మూత్రివి॥॥।


జాషువాలోని ఈ దేశాభిమానం "గబ్బిలం" ద్వితీయ భాగంలో ప్రస్ఫుటమౌతుంది। ఈ భాగ రచనాకాలం నాటికి - "గాంధీ ఉద్యమం చేత సీమగడ్డకు కన్నులు చెమ్మగిల్లాయి, ముతక వస్త్రానికి మర్యాద పొటమరించింది। వడకు నూలు పగ్గాలు పేనించి వేటగాడు ఉచ్చులె వేశాడు। స్వరాజ్యమనే సింహరాజు అందులో చిక్కుకుంటాడే లేక తప్పించుకుంటాడో" అని సాలోచనగా అంటాడు। దీన్లో కూడా తన వ్యధని పలుకుతాడు।

జాతీయోద్యమ యుద్ధరంగ మహితోత్సాహ ప్రతిద్వానముల్

కూలీల్ బెట్టుచు నాల్గు జాతులకు గగ్గుర్పాటు గల్పించెడిన్

స్వాతంత్ర్యంబను స్వర్గసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో

ఖాతాలేదని త్రోసిపుచ్చెదరో! వక్కాణింపవే చెల్లెలా!


మెత్తని అధిక్షేపంతో హృదయానికి హత్తుకొనేటాట్లు చెప్పటం జాషువా కలం సొత్తూ। ఆయన అచ్చమైన గాంధేయవాది। కాబట్టే -

నిమ్నజాతుల కన్నీటి నీరదములు

పిడుగులై దేశమును కాల్చివేయు ననుచు

రాట్నమును దుడ్డుకర్ర కరానబూని

దెసల దోచె గుజరాతు ముసలి సెట్టి


అంటాడు। ఇలా దేశస్థితిని తెలియజేస్తూనే ప్రసక్తానుప్రసక్తంగా సామాజిక పరిస్థితిని వివరించాడు।

ఇక "గబ్బిలం" కావ్యానికి ప్రాణవాయువు సమకాలీన సంఘిక దుస్థితి। అనాది కాలం నుంచి మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడలు పెట్టి, మానవతను మటుమాయం చేసిన వర్ణవ్యవస్థ "వేయి పడగ"లై విజృంభిస్తున్న కాలం అది। కులం, సంపద- వ్యక్తి సాంఘిక ప్రతిపత్తికి కొలబద్దలై మన్నుతున్న రోజులవి। "భారత వీరుడు" ఆ రెంటిని హరించి పంచముని పిప్పిచేస్తున్న దుర్భరస్థితి అది। ఎవరైతే తనను నిరాదరణకు గురిచేస్తున్నారో వారి "పాదము కందకుండ" చెప్పులు కుట్టి జీవనము సాగిస్తున్నాడు అరుంధతీ సుతుడు। అటువంటి వాని సేవకు భారతావని 'అప్పు పడ్డది'

వాడు చెమటోడ్చి ప్రపంచమునకు

భోజనము పెట్టు, వానికి భుక్తిలేదు


ఇదీ వాని స్థితి। అస్పృశ్యులు పండించే ధాన్యాన్ని ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు। కానీ ఆ ధాన్యం పండించే వారికి మాత్రం ఆలయ ప్రవేశం లేదు। వ్యక్తి స్వేచ్చనూ, మానవతా విలువల్ని నాశనం చేస్తున్న మనిషికీ మనిషికీ అగాధాన్ని సృష్టిస్తున్న వర్ణవ్యవస్థ మీద ధ్వజమెత్తి సమతా సిద్ధాంతాన్ని ప్రబోధించాడు జాషువా।

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (నాలుగు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు

నలువురు కుమారులనుట విన్నాముగాని

పసరము కన్న హీను డభాగ్యుడైన

యైదవ కులస్థు డెవరమ్మా! సవిత్రి


అసలే చాతుర్వర్ణ వ్యవస్థ। అందులో మరలా అయిదవ కులమని ఇంకో కుల మేమిటి? దీన్ని ఎవరు సృష్టించారు। సమాధానం లేనివి కావు ఈ ప్రశ్నలు। మన దేశంలోనే కాదు। ఇతర దేశాల్లో కూడా వర్ణ వైషమ్యాలు లేకపోలేదు। అయితే హైందవ సమాజంలో ఈ కులాల వ్యవస్థ "నిచ్చెన మెట్లు పద్ధతి" (Graded System)లో ఉండి - ఒక కులం అగ్రవర్ణం, మరో వర్ణం అథమ వర్ణం అని వరుసగా నిర్ణయించి ఆ చట్రంలో తరతరాలుగా మార్మికంగా, విరాటంకంగా దోపిడీ సాగిస్తున్న వాళ్ళని నిలదీస్తాడు జాషువా।

ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి

యినుపగజ్జెల తల్లి జీవనము సేయు!

గసరి బుసకొట్టు నాతని గాలిసోక

నాల్గు పడగల హైందవ నాగరాజు


పాములకు గాలి ఆహారం అనేది జశ్రుతి। బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములనే నాలుగు వర్ణాలను పడగలుగా కల్గిన హైందవ నాగరాజు, తాను వాయుభక్షకుడే అయినా - పంచముని గాలి సోకితే చాలట! కసరి బుసకొడతాడట। రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసికొని, తమ అభ్యున్నతికి ఈ పంచముడైతే శ్రమిస్తున్నాడో, అతన్ని దరిచేరనీయకపోవటం, అస్పృస్యత సాకుతో దూరం చేయటం జాషువా హృదయాన్ని కలచివేశాయి। గుండె కుతకుతలాడింది। ఆ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావానే 'గబ్బిలం' కావ్యం।

కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి

స్వార్థలోలురు నా భుక్తిననుభవింత్రు

కర్మమన నేమొ, దానికీ కక్షయేమొ

ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ!


అని గబ్బిలాన్ని కోరుతాడు। హేతువాది, వాస్తవికతావాది అయిన జాషువా ప్రశ్న ఇది। ఔషధంలేని అస్పృశ్యతా జాడ్యానికి వ్యతిరేకంగా జాషువా సంధించి విడిచిన నిశిత బాణం ఇది। ఆయన ఆర్థిక చైతన్యానికీ, తాత్త్విక చైతన్యానికీ నిదర్శనాలు ఈ పంక్తులు। "సహజమైన ప్రకృతి సౌఖ్యంబు నొక వ్యక్తి దొంగిలించి మనుట దొసగు నాకు" అని దోపిడీ తత్వాన్ని సమాజిక అక్రమంగా గుర్తించిన జాషువా పతితులు, భ్రష్టులు, బాధాసర్ప దష్టులు అయిన పీడిత పంచమ జాతి పక్షపాతి।

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః

ఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్

మెదుకు విదల్పదీ భరత మేదిని ముప్పది మూడుకోట్లదే

వత లెగబడ్డ దేశమున భాగ్యవిహీతుల క్షుత్తులారునే


"వాని నిద్ధరించి భగవంతుడే లేడు మనుజుడెట్లు గనికరించు" అన్న అభిప్రాయాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి పై పంక్తులు। గబ్బిలానికి మార్గనిర్దేశం చేసేటప్పుడు కూడా నీ ప్రయాణంలో సుడిగాడ్పులిదురైతే "నిలువవచ్చుం ధర్మసత్రాలలో పిడుగులు వడ్డ" అని చెబుతూ॥ ఎలాంటి ప్రాణాపాయ సమయంలోనైనా "ప్రవేశ యోగ్యతలు పాపిన్నాకు లేవచ్చటన్" అని "పులుగుంబుట్ర"కంటే హీనమైన పంచముని దుస్థితిని వ్యక్తీకరిస్తాడు। ఈ దేశంలో పషుపక్షాదులకున్న గౌరమన్నా పంచములకు లేదనటం జగమెరిగిన సత్యం।

వాని తలమీద బులిమిన పంకిలమును

గడిగి కరుణింప లేదయ్యె గగనగంగ


గంగ కల్మషహారిణి అంటారు। అ విషయంలో ఇక ఆకాశగంగ విషయం చెప్పనక్కరలేదు। మరి అలాంటి ఆకాశగంగ కూడా ఆ పంచముడి నెత్తిమీద హైందవ సమాజం పులిమిన బురదను కడిగి దయచూపలేదట। ఎంత అమానుషం! ఎంత క్రూరం!

ఈ వర్ణ వ్యవస్థలోని అక్రమాన్ని మరింత వ్యంగ్యంగా గబ్బిలంతో చెప్పే మాటల్లో చెబుతాడు॥

ఆలయంబున నీవు వ్రేలాడు వేళ

శివుని చెవి నీకు గొంతచేరువుగ నుండు

మౌని ఖగరాజ్ఞి! పూజారిలేని వేళ

విన్నవింపుము నాదు జీవిత చరిత్ర!


దేవుడు కురుణించినా "పూజారి" వరమియ్యడనేది పాత బడ్ద సామెత। "అమ్మా! గబ్బిలమా? శివిడికి పంచముల ఆక్రందనలు విన్నవించే సమయంలో పూజారి గనక విన్నాడంటే నీకు "ప్రాయశ్చిత్తం" తప్పదు। అంతెందుకు, పూజారికి ఆ పరమ్ శివుడు కూడా భయపడతాడు। నీవు విన్నవించే విషయం పూజారికి తెలిసిందని ఆ దేవదేవుడికి తెలిస్తే 'అతడు కూడా' నీమీద కోపగిస్తాడమ్మా! కాబట్టి పూజారి విషయం జాగ్రత్తగా చూసుకో" అని హెచ్చరిస్తాడు। ఇలా ప్రతి పద్యంలో జాషువా పాఠకుల కళ్ళముందు ప్రత్యక్షమవుతాడు। సామాజిక రంగంలోనే కాదు కాళారంగంలో కూడా "పుట్టరాని చోట పుట్టిన" కారణంగా తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతాడు జాషువా।

ఎంత కోయిల పాట వ్యధ యయ్యెనో కదా!

చిక్కు చీకటి వనసీమలందు,

ఎన్ని విన్నెలవాగు లింకి పోయెనో కదా!

కటిక కొండల మీద మిటకరించి,

ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా!

మురికి తిన్నెల మీద పరిమళించి,

ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా!

పండిన వెదురు జొంపములలోన,

ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను

ఎంత రత్నకాంతి ఎంత శాంతి

ప్రకృతి గర్భమందు! భగ్నమైపోయెనో

పుట్టరాని చోట పుట్టుకతన


"కవికోకిల" బిరుదాంకుతుడు జాషువా। ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించిన వారే కోకిల 'పంచమ స్వరం'లో కూస్తుందని శ్లేషల్ని ఆశ్లేషించి, భాషా ప్రౌఢిమ ప్రదర్శించి, తమ అక్కసు చాటుకోలేదా? అయినా సాహితీ ప్రియుల హృదయ ఫలకల మీద తన ముద్రను భద్రపరుచుకొన్నాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం। అయినా సృజనాత్మకత(creativity)కి కూడా కులమతాల మలాములంటించిన 'భారతీయత'కు మంగళహారతులు పట్టవలసిందే మరి!

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఐదు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

అయితే ఇక్కడ చెప్పుకోవలసిన మరో విశేష లక్షణం జాషువాలో ఉంది। హైందవ సమాజంలోని దారుణమైన అస్పృశ్యతా సమస్యను చిత్రించిన జాషువా కవే పంచముల్లోని అంతర్భేదాల్ని ఎండాగడతాడు।

కలదమ్మా వ్రణమంటరానితన మాకర్ణింపు మీ ఇండియా

పొలమందుంగల మాలమాదిగలకున్ భూతేశుడే కాదు కృ

ష్ణులు, కృష్ణున్ని రసించు దైవములు క్రీస్తుల్, మస్తుగా బుట్టినన్

కలుపన్నేరరు రెండు జాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్


అని వ్యధ చెందుతాడు। అగ్ర వర్ణాల దౌష్ట్యాన్ని ఎంత నిర్భయంగా ఖండించాడో, అంతిమ వర్ణాల అజ్ఞానాన్ని అంత నిష్పాక్షికంగా నిరసించాడు జాషువా। ఒకవైపు స్వర్ణ హిందువుల దౌష్ట్యం పాము పడగలై బుసలు కొడుతుంటే, మాలలమనీ, మాదిగలమనీ 'ఐకమత్యాన్ని' మరచి కుమ్ములాటలో మునిగితేలే వారిని కలపటం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరిస్తాడు। అది నిజమే! కవి రాసిన అర్థశతాబ్దం తర్వాత కూడా ఆ స్థితిలో అడుగు ముందుకు వేయలేకపోవటానికి ఆత్మ విమర్శనం అవసరం కదా? కవ 'క్రాంరిదర్శి' అనటానికి వేరే నిదర్శనం కావాలా?

మత వైషమ్య నిరసనం, అస్పృశ్యతా నిరసనం, అంధ విశ్వాస నిరసనం, దారిద్ర నిరసనం అనే నాలుగు స్తంభాలపన జాషువా కవితా సౌధం నిలబడింది। ఆంతర్యాన్ని పరిశీలించటం, అసమానతను ప్రశ్నించడం, అన్యాయాన్ని ప్రతిఘటించడం - అయన కవిత్వానికి ఆయువు పట్టులు।

ముసుగులో గుద్దులాటలు పొసగవింక

హక్కు కలదయ్య ప్రశ్న సేయంగ నిన్ను!


అని సూటిగా భగవంతుణ్ణైనా ప్రశ్నిస్తాడు। ఈ చైతన్యంతో జాతి, మత, కుల శృంఖలాల్ని చేదించుకున్న జాషువా తాను "విశ్వనరుణ్ణి" అని ఉద్ఘాటిస్తాడు।

కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి

పంజరాన గట్టువడను నేను

నిఖిలలోకమెట్లు నిర్ణయించిన

నాకు తరుగులేదు విశ్వనరుడనేను

(ఖం।కా।భాగ।5.నేను)


కరుణ వీరరస కావ్యం:

అభ్యదయ కవిత్వంలో కరుణ వీరరసాలు సమ్యక్సమ్మేళనం చెంది కన్పిస్తాయి। భూత, వర్తమాన కాలాల్లోని సామాజిక అసమానతల్ని, దోపిడీని గుర్తించి, నిరూపించి॥ ఇప్పుడైనా వాస్తవాన్ని గ్రహించి, భవిష్యత్తులో ప్రగతి పథం వైపు - ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి సాగిపొమ్మని చెబుతుంది। అభ్యదయ కవిత। స్థితి నిరూపణలో కరుణం, మార్గనిర్దేశంలో వీరం - ఈ రకం కవితల్లో ధ్వనిస్తాయి। జాషువా తన కవితల్లో కరుణ రసం లోంచి వీరరసాన్ని పొంగించాడు।

కరుణరస మొండె కఠిన రాక్షసముల్

హృదయములను గలచి ముదము గూర్చు

వేడి కంటె నీటి విలువ సహజమైన

చలువ లీను అశ్రువులకు లేదు।

(ముసాఫర్లు)


జాషువా అక్షరాల్లో చిందే కన్నీళ్ళు అగ్నికణాలు। నిమ్నజాతుల కన్నీటి నీరదాలు పిడిగులై దేశాన్ని కాల్చివేస్తాయని నొక్కి వక్కాణించే విస్ఫులింగాలు। "తల వాక్రుచ్చగరాని నెత్తుటి సిరా"తో రాసిన గబ్బిలం 'ఇద్ద కరుణా పరిణద్దరస ప్రబంఢము"గా 'భాష్ఫ కణాభిరామము' గా రూపెత్తింది।

జనులం చీలిచి పిప్పిజేసెడు దురాచారంబులన్ గాల మ

ట్టని విద్యాబలమేల? విద్యయన మౌఢ్యవ్యాఘ్రి కింపైనచో

జనమా? మోసపు వ్రాతకోతలకు రక్షాబంధమా? ఎందుకీ

మనుజత్వంబు నొసంగలేని చదువుల్ మైరేయపుం మైకముల్


ఈ విధమైన భావచాలనం జాషువా కవిలోని ప్రతిఘటనాత్మక వైఖరిని పట్టి ఇవ్వటం లేదూ? 'ఉరము నిక్క గల్కి యుద్రేకమొదవించు నవ్యకవి'లాగా జాషువా విప్లవాన్ని ప్రకటించలేదు। సంయమనాన్ని ప్రకటించాడు।

ధర్మ సంస్థాపనార్థంబు ధరణిమీద

నవత రించెదననె నభవుని తండ్రి

మునువు జన్మించి నెత్తికెత్తినది లేదు

నేడు జన్మింపకున్న మునిగినది లేదు


అని ఖరాఖండిగ చెబుతాడు। శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు యుగ యుగంలోనూ సంభవిస్తానన్న ఆ శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాల్లో ఎంతమంది రాక్షసుల్ని సంహరించాడో కానీ, ఆ రాక్షసుల్ని మించిన అభినవ రాక్షసులు కులమతాలనే ఆయుధాలతో జనుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు। మరి వాళ్లని అంతం చేయటానికి ఆ శ్రీమహావిష్ణువు ఎప్పుడు పుడతాడో? అసలు పుడతాడా? పుట్టి ఒరగబెట్టింది ఇంతకు ముందులేదు। ఇక మీదట ఒరుగుతుందన్న నమ్మకం లేదు। అవకాశవాదులు తమ స్వార్థం కోసం కల్పించుకొన్నవే ఈ పురాణాలు, ఈ కథలు అని జాషువా తీర్పు।

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఆరు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

వైరుధ్యంలో వైశిష్ట్యం:

అభ్యుదయ కవితా తత్వాన్ని జీర్ణించుకొన్న జాషువా సమకాలీన అభ్యుదయ కవుల్లా గేయ చందస్సునూ, వచన కవితా రీతినీ చేపట్టలేదు। శిష్ట వ్యవహారికాన్ని స్వీకరించనూ లేదు। సరళ గ్రాంధికాన్ని, ప్రాచీన పద్య చందస్సునూ సమాశ్రయించాడు। అయినా కండగల పద్యరచన జాషువాది। సమకాలీన పద్యకవుల్లో జాషువు పద్యం పొందినంత నిస్తుల ప్రచారం మరేకవి పద్యం పొందలేదనటం అతిశయోక్తి కాదు! సహజోక్తే! పద్య శిల్పం జాశువాదే। అభ్యుదయ కవుల్లో శ్రీశ్రీ గేయానికి ఎంత ప్రచారం, ప్రాశస్త్యం తెచ్చాడో॥ జాషువా పద్యానికి అంతటి జవజీవాల్ని తెచ్చిపెట్టాడు। కవిత్వానికి రూపం(form) కంటే వస్తువే ముఖ్యమని నిరూపించిన కవి జాషువా। వస్తువు(content) మారినపుడు రూపం కూడా మారటం సర్వసాధారణమైన సాహిత్య సూత్రం। అయిన ఆ సార్వత్రిక సూత్రాన్ని అధిగమించి కాలం పరీక్షల్లో నిలిచి గెలుపొందింది జాషువా పద్యం। పద్యం తెలుగువాడి సొంత సొత్తు। దాన్ని పసిగట్టి ప్రజల గుండెల్ని దోచుకున్నాడు। కాలానికి ఎదురొడ్డి నిలిచాడు। తన కవితను బ్రతికించుకున్నాడు। ఆయన పద్యంలోనే వ్రాశాడనీ, గ్రాంధిక భాష వాడాడనీ ఈ సహృదయ పాఠకుడు ఆయనకు దూరం కాలేదనటం వాస్తవం। చెప్పే విషయం చేవగలదై, చెప్పే విధానం జీవద్వంతమైతే పాఠకుడు ఎందుకు ఆదరించుడు? అవి రెండూ చేతగాని కవుల కావ్యాలు పేజీల లెక్కన కాదు। కేజీల లెక్కన మిగులుతాయి।

జాషువా - భవిష్యత్సమాజ దర్శనం:

"జీవితం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది। నా గురువులు ఇద్దరు - పేదరికం, కులమత భేదం। ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు। దారిద్ర్యాన్ని, కులభేదాన్ని కుడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను। వాటిపై కత్తి కట్టాను। అయితే కత్తి నా కవిత। నా కవితకు సంఘంపై ద్వేషం లేదు। దాని విధానంపైనే నా ద్వేషం" (మా నాన్న।పు।10) - అన్నాడు జాషువా। అంటారానితనంలోని అవమానాన్ని, దారిద్ర్యంలోని బాధను తాను స్వయంగా అనుభవించాడు। తన తోటి సోదరులు, బంధువులు జీర్ణ కుటీరాలలో వుంటూ రోజుకూలిపై అర్థాకలితో మాడుతూ బ్రతక లేక బ్రతికే వారి బాధలను, జీవిత గాధలను ప్రత్యక్షంగా చూశాడు। దానికి రూపకల్పనే 'గబ్బిలం'। తెలివికి కలిమిలేములతో నిమిత్తం లేదనీ, ప్రతిభను కులమతాల తక్కెడలో తూచరాదనీ విశ్వసించి, కులమతాల కతీతమైన మానవతా తొణికిసలాడే మరో ప్రపంచం కోసం అర్రులు చాచిన జాషువా, 'గబ్బిలం' కావ్యంలో తాను ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నాడో సూచించాడు। ప్రజలను బాధపెట్టే బహుదేవతలు లేని చోటు, నవనీత సమానమైన కవుల కమ్మని వాక్కు భయము లేకుండా వెల్లివిరిసే నేల ప్రభుత్వ పరంగా - పాలకవర్గాలు - సృజనాత్మక రచనల మీద 'ఆంక్షలు-నిషేధాలు' విధించని చోటు - ఎంతముందు చూపు జాషువాది? సంతానానికి భేదభావాలు నేర్పని తల్లిదండ్రులున్న స్థలం, తోడునీడలేని దుర్బలుల కాచే ప్రదేశం - ఇలాంటి దేశాన్ని, సమాజాన్ని కోరుకున్నాడు జాషువా।

భోగులాహరించు భుక్తి కన్నుల జూచి

పరమ పేదలు దుఃఖపడనిచోటు,

సాంఘికాచార పంచాస్య గర్జనమున

బెదరక జ్ఞానంబు పెరుగుచోటు,

జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి

కందక కళలు పెంపొందుచోటు,

పరిపాలక క్రూరతర కరాసికి లొంగి

పోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు,

అనద బిడ్డలు జూడ నెయ్యింపు సుతుల

ముద్దులాడని గుణనిధుల్ బుట్టుచోటు

చెప్పగదమ్మ చూచివచ్చితివె నీవు

నిశ్చయింబుగ వాసముండెదను నేను


జాషువా ఆశించిన 'కొత్తలోక'మిది। ఇటువంటి భావాలతో 'గబ్బిలం' నిజమైన సామాజిక వాస్తవికతావాద (social realistic) కావ్యం। కర్మ సిద్ధాంతం నుంచి కవిత్వం దాకా॥ వినుకొండ నుంచి వెండికొండ దాకా॥ నన్నయ నుండి వేమన దాకా ఇలా ఆయన హృదయాన్ని స్పృశించి, స్పందింపజేసిన ప్రతి అంశాన్ని రసవత్తరంగా మలచిన సామాజిక సందేశాన్ని అందించిన కవి జాషువా। సమాజ సముద్ర మధనం చేసి జాషువా సాధించిన అమృత కలశం 'గబ్బిలం'। దళిత వేదనకు అక్షర రూపం 'గబ్బిలం'

కోటానుకోట్ల నరులొక

మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిం

చాటింపు మీ సువార్తన్

జాటింపుము జీవితంబు సార్థక్యమగున్
(ముసాఫరులు)

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

------------------------------------------------------- సమాప్తం