Sunday, January 24, 2010

పాపం, గేదె కష్టాలు...


ఎఱ్ఱగడ్డ వంతెన దగ్గర కనిపించిందీ దృశ్యం మాకు ఇవాళ. పాపం ఆ గేదె ఎంత ఇబ్బంది పడుతూ అలా మెడ వేలాడేసుకుంటూ కూర్చుందో.....

ఇదివరకు ఒకట్రెండు సార్లు ఇలా గేదెని, దాని దూడని తీసుకెళ్లడం చూసాను. సాధారణంగా గేదెని నుంచోపెట్టి, అది కదలకుండా అన్ని వైపులా కట్టి, మెడకి ఇంకాస్త పకడ్బందీగా బంధం వేసి, బండికి కడతారు. పాపం ఈ గేదెకి కాళ్లు నెప్పట్టి కూర్చోవాలని ప్రయత్నించిందేమో. ఇలా మెడ వేళాడేసుకుంటూనే అది కూర్చుని ఎంత దూరం ప్రయాణం చేస్తొందో.....

ఫోటో క్రిడిట్స్ - మా ఆవిడ

Wednesday, January 06, 2010

కోతి కొమ్మచ్చి, ఈ మధ్యనే పాల్గొని, ఆడాను....

నండూరిగారూ నేనూ మానేసిన ఆరునెలలు తరవాత వీక్లీసేల్సు 85 వేలకి పెరిగాయి.
మేం వచ్చిన ఆర్నెల్లలో ఇరవై వేలు పెరిగింది అని కొత సంపాదకవర్గం లేని మీసాలు మెలేసి, వాటికి మైనం పూసి వాటిమీద నిమ్మకాయలు నిలబెట్టింది. యువరాజు ఔనన్నట్లు మందహాసం చేశారు.
చిన్న కో.కొ. జోకు:
హాలీవుడ్ లో ఒక జంట పెళ్ళయిన ఎనిమిది మాసాలకే విడాకులిచ్చుకుంది. ఆ పిల్ల వెంటనే ఇంకో మంచి కుర్రాడిని పెళ్ళాడింది. తొమ్మిదోనెల నిండాగానే కొడుకుని కన్నది. కొత్త మొగుడు మీసాలు మెలేశాడు.
"రికార్డు! పెళ్ళయిన ఒక్క నెలలో కొడుకుని కన్నాను!" అని. నీచోపమానం. సారీ చెరిపెయ్యండి.

రెండో రాజీనామా తరవాత సంపాదన కుళాయి ధార సన్నబడింది.

-------------------------------------------------------------------
ఇది కోతి కొమ్మచ్చి మొదటి భాగం ముగింపు, రెండో భాగానికి పలకరింపు.
బాపు - రమణల స్వీయ చరిత్ర.
రమణ రాతలు, బాపు గీతలు
ఎన్నో జోకులు, వాటికి బొమ్మల షోకులు
విషయాలు పాతవి, కాని ఎంతో కొత్తగా వినిపిస్తాయి.
మరి మొదటి భాగం అలా ముగిస్తే... మొదలవ్వడమేమో, ఇలా మొదలయ్యింది.
-------------------------------------------------------------------
గడచిపోయిన కష్టాల కథ - ఈదేసిన గోదావరి - దాటేసిన గండం - తార్రోడ్డుమీద ఎండలో జోళ్ళు లేకుండా నడిచి నీడకు చేరిన కాళ్ళు - ఈ కష్టలు అనుభివిస్తున్నప్పుడు బాధగానే వుంటుందిగాని, అవి దాటిపోయాక - వాతిని తలుచుకోవడం - వినేవాళ్ళకి అనుభవాలుగా చెప్పడం - ఆ హాయికి కొత్తావకాయ కూడా సాటిరాదు - అందుకే గతకాలము మేలు వచ్చుకాలముకంటే అన్నారు పెద్దలు...."
-------------------------------------------------------------------
రెండో భాగం (ఇం)కోతి కొమ్మచ్చి ఈ మధ్యనే విడుదలయ్యింది. మొదటి భాగం ఇప్పటికే నాలుగు ముద్రణలు ముద్రించుకుంది..... ముద్దుగా మరెన్నో ముద్రణలు ముద్రించుకుంటుంది కూడా....
మీరింకా చదవలేదా? ప్చ్, మీకు నా సానుభూతి.

Saturday, January 02, 2010

శబ్దార్థ సర్వస్వం - 3,80.000 పేజీల వ్రాత ప్రతి

ఓ వేమన పద్యం (గుణయుతునకు) కోసం గూగులమ్మని అడగ్గా అది మూడు ఫలితాలన్నిచ్చింది. వాటిలో రెండు ఫలితాలు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంధాలయం & పరిశోధనాలయం" వారి వెబ్సైటులోవి. ఈ వెబ్సైటుని నేను మొదటి సారి చూస్తున్నాను. ఇదేదో విలువైన భాండాగారమల్లే వుందే అని దానిని చూడ్డం మొదలెట్టాను.అక్కడే కనిపించింది నాకు, "శబ్దార్ధ సర్వస్వం".

"శ్రీ పరవస్తు వెంకట రాంగాచారి గారి శబ్దార్ధ సర్వస్వం అనే సంస్కృత రచనని సర్వ సంగ్రహ నిఘంటువుగా పేర్కొనవచ్చును. ఈ రచన అన్ని విషయాల గురించి సంస్కృత భాషలో విశదపరుస్తుంది. ఈ రచన కాస్తకాస్తగా ముప్పై అయుదేళ్ల కాలావధిలో రాస్తూ పోయినప్పటికీ, ఆయన తన జీవితకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఈ పుస్తకం అచ్చయి ఉండి ఉంటే సంస్కృత భాషకే తలమానికమయ్యేది, శాశ్వతంగా నిలిచేది" అని ఈ పుస్తక పరిచయంలో అక్కడ రాసారు.

బావుంది, అని ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాను. అక్షరాలా మూడు లక్షల ఎనభై పేజీల వ్రాత ప్రతి !!! 1865లో ప్రారంభించి ముప్పైఐదేళ్ల పాటు కొంచెం కొంచెంగా రాస్తూ కూడా అసంపూర్ణంగా మిగిలిపోయిందిట. ఈ ఉద్గ్రంధాన్ని ఈ సంస్థ digtise చేస్తోంది. ఇప్పటికి నూటయాభై భాగాలుగా digtise చేసారు. ఈ పుస్తకం సంస్కృత పుస్తకమే అయినా, అది రాసినది తెలుగు లిపిలో. ప్రయత్నిస్తే, ఆ చేతిరాత చాలా మటుక్కు నేను (తెలుగు చేతి రాత చదివి, రాసి ఓ పుష్కర కాలమయ్యింది) కూడబలుక్కుని చదవగలుగుతున్నాను. నేను చూసిన ఓ 10-15 పేజీల వరకు, పుస్తకం కూడా బాగానే కాపాడిపడినట్టు లెక్క.

కేవలం అ, ఆ అక్షరాల వరకు దీనిని అచ్చేసారుట. దానికే 650 పేజీలయ్యాయి. ఆ అచ్చు పుస్తకంకూడా వీరి దగ్గర వుంది.





35 సంవత్సరాల్లో 3,80,000 పేజీలంటే, దాదాపు రోజుకి ముప్పై పేజీలు రాసారన్నమాట ఆ మహానుభావుడు. ఈ పుస్తకం ఎంత గొప్పదో ఊహించడానికి కూడా నాకు అర్హత లేదేమో అనిపిస్తోంది. ఈ కొత్త సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం, ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఉన్న ఈ సంస్థకి వెళ్లి ఈ పుస్తకాన్ని చూసిరావాలి.

ఈ పుస్తకం మొత్తం చేతనయినంత తొందరగా వీకీ మూలం లాంటి చోటుకి చేరి, యావత్ప్రపంచానికీ వెతికేందుకు అందుబాటులోకి రావాలని ఆకాంక్ష.



ఇప్పటివరకూ digitise చేయబడిన నూటయాభై భాగాలు.